ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శవాన్ని చూస్తూ చెప్పిన మాటలతో లేచిన శవం,,,అందరూ ఒక్కసారిగా షాక్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 08:34 PM

కర్ణాటకలోని హవేరి జిల్లాలో షిగ్గావ్ తాలూకా బంకాపూర్‌కు చెందిన అశోక గుడిమని అలియాస్‌ మాస్తర్‌ (45) నాలుగు రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయనను చికిత్స కోసం షిగ్గావ్‌కు తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడ కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న గుడిమని.. సోమవారం చనిపోయినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంబులెన్సులో ఎక్కించుకుని స్వగ్రామం బంకాపూర్‌కు బయలుదేరారు. అయితే, షిగ్గావ్ నుంచి బంకాపూర్ వెళ్లే మార్గంలోని ఓ దాబాలో అశోక్ తరుచూ భోజనం చేశారు. అక్కడ ఆహారం అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆ దాబా వద్దకు అంబులెన్స్ రాగానే ‘నీకు నచ్చిన దాబా వచ్చింది. భోజనం చేస్తావా’ అంటూ బంధువు ఒకరు రోదిస్తుండగా.. అశోకలో చలనం మొదలైంది.


ఆయన మళ్లీ శ్వాసతీసుకుంటూ లేచి కూర్చున్నాడు. దీంతో బంధువులంతా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇది తమ భ్రమ అనుకుని ఒక్క క్షణం పాటు వారు అలాగే ఉండిపోయారు. కానీ, అతడు బతికే ఉన్నాడని గ్రహించి వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. అయితే, ఈ ఘటనపై స్థానిక కిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎఫ్‌ కమ్మార్‌ స్పందించారు. అతడి అవయవాలన్నీ పని చేయడం నిలిచి పోవడంతో చికిత్స కొనసాగుతున్న సమయంలో మరణించాడని భావించారని అన్నారు. బలవంతంగా వాళ్లే అంబులెన్సులో ఎక్కించుకుని వెళ్లారని ఆరోపించారు. శ్వాస ఉందని గుర్తించి, మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com