ఎంతో కాలంగా ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. సొంత బిడ్డలా కాపాడుకుంటున్న ఈ శునకాన్ని.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్న ఆమె వెంట తీసుకెళ్లాలని భావించింది. అందుకోసం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకుంది. కానీ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత సరైన పత్రాలు లేవంటూ కుక్కను వెంట తీసుకెళ్లనివ్వడానికి సిబ్బంది నిరాకరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని మహిళ కుక్కను తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. ఆపై ఒంటరిగా బయటకు వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయింది. అయితే బాత్రూంలోకి వెళ్లిన సిబ్బందికి విస్తుపోయే విషయం తెలిసింది. మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన 57 ఏళ్ల అలిసన్ అగాథా లారెన్స్ ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి టైవిన్ అనే పేరు పెట్టుకుని సొంత బిడ్డలా సాకుతోంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ శునకాన్ని కూడా తీసుకెళ్లేది. ఈక్రమంలోనే అలిసన్ లారెన్స్ కొలంబియాకు వెళ్లాలనుకుంది. అయితే వెంట తన పెంపుడు కుక్క టైవిన్ను కూడా తీసుకువెళ్లాలని భావించింది. అందుకోసం విమాన టికెట్లు కూడా బుక్ చేసింది. తాను వెళ్లాల్సిన సమయం రాగానే.. శునకాన్ని తీసుకుని గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
అయితే విమానం ఎక్కేందుకు ముందు టైవిన్ను తీసుకుని మరీ బోర్డింగ్ వద్దకు వెళ్లింది. అక్కడే పత్రాలు పరిశీలించిన సిబ్బంది.. అలిసన్ అగాథా లారెన్స్ వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించింది. ముఖ్యంగా ఆమె పెంపుడు కుక్క టైవిన్ను విమానం ఎక్కనివ్వమని చెప్పారు. మీ పత్రాలు సరిగ్గానే ఉన్నాయి.. వెళ్లాలనుకుంటే మీరు వెళ్లొచ్చని వివరించారు. దీంతో కాస్త నిరాశ, తీవ్ర కోపోద్రేకానికి గురైన అలిసన్ లారెన్స్ నేరుగా విమానాశ్రయంలోని బాత్రూంలోకి వెళ్లింది. అక్కడే తన ఇన్నాళ్లూ ప్రాణంగా పెంచుకున్న శునకం టైవిన్ను చంపేయాలని నిర్ణయించుకుంది. ఓ టబ్లో నీళ్లు నింపి ఆపై దాన్ని అందులో ముంచి చంపేసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా బయటకు వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయింది.
అయితే బాత్రూం శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడే కుక్క చనిపోయి కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి.. పశువైద్యులను పిలిపించారు. దానికి పోస్టుమార్టం నిర్వహించగా నీళ్లలో ముంచి చంపేసినట్లు గుర్తించారు. అయితే అది ఎవరి శునకమో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అలిసన్ అగాథా లారెన్స్ కుక్కగా గుర్తించారు. విమానం ఎక్కనివ్వలేదనే ఆమె ఇంత దారుణానికి పాల్పడిందని తెలుసుకున్నారు. ఆపై ఆమై అడ్రస్ తెలుసుకుని.. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
కొలంబియా వెళ్లి ఆమె ఇటీవలే తిరిగి రాగా.. విషయం గుర్తించిన అధికారులు మార్చి 18వ తేదీన అలిసన్ అగాథా లారెన్స్ను అరెస్ట్ చేశారు. తీవ్రమైన జంతు హిసంకు పాల్పడినందుకు గాను లేక్ కౌంటీ జైల్లో కేసు నమోదు చేశారు. ఇది మూడవ డిగ్రీ నేరం కాగా.. 5 వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను కుటుంబ సభ్యులు బెయిల్ మీద బయటకు తీసుకువెళ్లారు. అరెస్ట్ చేసిన 5 గంటల్లోనే ఆమె బయటకు వచ్చింది.
![]() |
![]() |