గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలోని శాంతి నగర్లో సోమవారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలం విషయంలో గ్రామస్తులకు - చిన్నికృష్ణ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇదంతా వీడియో తీసుకున్న యువకుడిపై సీఐ రవీంద్ర బాబు దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో సీఐపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల - గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో వాహనం అద్దాలు ద్వంసమయ్యాయి. సీఐ క్షమాపణ చెప్పాలని కర్నూలు -గుంటూరు రాహదారిఫై ఆందోళనకారులు టైర్లు తగలపెట్టి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ముందుగా గ్రామస్తులు దాడికి ప్రయత్నించి, కారుపై రాళ్లు రువ్వారని సిఐ రవీంద్ర బాబు అన్నారు. కాగా గుంటూరు జిల్లా, ఫిరంగిపురం, శాంతినగర్లో ఉన్న ఓ కమిటీహాల్కు చెందిన మూడు సెంట్ల స్థలం కబ్జా చేశారని చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబంపై గ్రామస్తులు ఆరోపిస్తూ.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. విచారిస్తుండగా ఓ యువకుడు వీడియో తీస్తుండటంతో సీఐ అతనిపై దాడి చేశారు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆ సమయంలో సీఐ గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడంతో గ్రామస్తులు రాళ్లు, కర్రలతో పోలీస్ వాహనంపై దాడి చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం కావడంతో చేతిలో సీఐ తుపాకి పట్టుకొని ఆందోళన కారులను బెదిరించారు. సీఐ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |