ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు సంబంధించిన నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ‘ భారత్లో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. విదేశాలకు వెళ్లేవారిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. ఏపీ నుంచి 2016లో 46,818 మంది విద్యార్థుల విదేశాలకు వెళ్లగా.. 2018 నాటికి ఇది 62,771కి చేరినట్టు తెలిపింది. అయితే, కోవిడ్-19 కారణంగా 2020లో మాత్రం 35,614కి తగ్గినట్లు పేర్కొంది. అయినప్పటికీ మొదటి స్థానంలో ఏపీ విద్యార్థులే ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఏపీ తర్వాతి స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్లు నిలిచాయి. 2024 గణాంకాల ప్రకారం మొత్తంగా 13.35 లక్షల మంది భారతీయులు విదేశాల్లో చదువుకుంటున్నారు. వీరిలో 8.5 లక్షల మంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే ఉండటం గమనార్హం. 2016-24 మధ్య విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో 8.84 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం ఏటా రూ.6.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారని, ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానమని పేర్కొంది.
అంతేకాదు, భారత వాణిజ్య లోటులో 75 శాతానికి కారణం విదేశీ చదువుల కోసం మన విద్యార్థులు చేస్తున్న ఖర్చులేనని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. భారత్లో విద్య కోసం సగటున ఒక విదేశీ విద్యార్థి వస్తుంటే.. 25 మంది బయటకు వెళ్లిపోతున్నట్లు తెలిపింది. అలాగే, 2011 నుంచి ఇప్పటివరకూ 16 లక్షలమంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లినవారేనని అంచనా. ఈ పరిస్థితి మారాలంటే భారతీయ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థులు పెద్దఎత్తున చేరేలా ఆకర్షించాలని నీతి ఆయోగ్ సూచించింది.
వికసిత్ భారత్ 2047 లక్ష్యం చేరుకోవాలంటే విదేశీ విద్యార్థుల సంఖ్యను అప్పటికి 7.89 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించింది. అంటే, దేశీయ విద్యార్థుల్లో ఒక శాతానికి సమానంగా అంతర్జాతీయ స్టూడెంట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అయితే, 2012-13 నుంచి 2021-22 పదేళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఒక్క పంజాబ్లోనే 300 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లు కూడా మెరుగైన వృద్ధినే నమోదు చేసినట్లు తెలిపింది.
కానీ, విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ముందున్న పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలు టాప్-10 స్థానాన్ని కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. కోల్కతా, హైదరాబాద్ నగరాల్లో ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు ఉన్నప్పటికీ విదేశీ విద్యార్థుల్ని ఆకట్టుకోవడంలో ఈ రెండు రాష్ట్రాలు వెనుకబడినట్లు వెల్లడించింది. ఇకపై అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడానికి విధానపరంగా చేపట్టాల్సిన 22 మార్పులను సిఫార్సు చేసింది. దేశంలోని 24 రాష్ట్రాల్లోని 160, 16 దేశాల్లో 30 ఉన్నత విద్యాసంస్థలపై ఆన్లైన్ద్వారా సర్వే నిర్వహించి నీతి ఆయోగ్ దీనిని రూపొందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa