కర్నాటకలో ఐఏఎస్ల మధ్య విబేధాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయం మీద ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. మరో రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. ఇదే ఇషయాన్ని మైసూరులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోమశేఖర్ కూడా వ్యక్తం చేశారు. జిల్లా పాలనాధికారిణి రోహిణీ సింధూరీ తీరుకు నిరసనగా మైసూరు మహానగర పాలికె కమిషనరు శిల్పానాగ్ రాజీనామా సమర్పించారు. దీంతో శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దు అంటూ డిమాండ్ చేస్తూ మహానగర పాలికె ఎదుట కార్పొరేటర్లు, పాలికె సిబ్బంది ధర్నా చేశారు. అనంతరం సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు, పాలికె సిబ్బంది మండిపడ్డారు. రాజీనామా చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ను మంత్రి ఎస్టీ సోమశేఖర్ సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్కు మంత్రి సూచించారు. శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్కు మనవి చేస్తానని సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను అన్ని ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్ఆర్ ఫండ్స్కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన 12 కోట్ల రూపాయల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. గ్రామాలకు వైద్యులు సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్ఆర్ ఫండ్స్ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరాను. శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించానని రోహిణి సింధూరి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa