ప్రయోగ దశలో ఉన్న తమ కొవిడ్ మాత్ర ఒమైక్రాన్ నుంచి రక్షించగలదని భావిస్తున్నట్లు ఫైజర్ సంస్థ మంగళవారం తెలిపింది. 2250 మందిపై నిర్వహించిన అధ్యయనంలో మాత్ర విషయంలో సానుకూల ఫలితాలు కనిపించాయని పేర్కొంది. ఒమైక్రాన్ సోకినవారు ఆస్పత్రిపాలు కాకుండా, మరణించకుండా 89 మేర తమ మాత్ర రక్షణనిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) త్వరలోనే కీలక ప్రకటనను చేయొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా ఫైజర్/బయోఎన్టెక్ టీకా రెండు డోసులు వేసుకుంటే ఒమైక్రాన్ వేరియెంట్ నుంచి 33 శాతం రక్షణ మాత్రమే కల్పిస్తుందని, ఆస్పత్రిపాలవకుండా 70 శాతం రక్షిస్తుందని దక్షిణాఫ్రికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఒమైక్రాన్ వేరియెంట్ మొదలైనప్పటి నుంచీ దక్షిణాఫ్రికా, బోత్స్వానా దేశాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కాగా.. సూదితో వ్యాకినేషన్ గురించి భయపడేవారికి సులభమైన రీతిలో టీకాను అందించేలా యూకేలోని కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధకులు, డయోసిన్వ్యాక్స్ అనే సంస్థతో కలిసి ఒక వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. ఈ పద్ధతిలో చిన్న చేతి యంత్రంలో గాలి ఒత్తిడితో వ్యాక్సిన్ పొడిని చర్మంలోకి వెళ్లేలా చేస్తారు. దేశాంతర ప్రయాణాలకు కొవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేసిన 20 రోజులకు ముందు, 40 రోజుల తర్వాత టీకా సగటు తక్కువగా ఉన్న దేశాల్లో వ్యాక్సినేషన్ పెరిగిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa