నూతన సంవత్సరంలో కోరికలు కోరేందుకు గుడికి వెళ్ళిన భక్తులు కొందరు తొక్కిసలాటలో మరణించారు.
కొత్త సంవత్సరం వేళ జమ్మూకశ్మీర్లో తీరని విషాదం నెలకొంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె చెంతకే చేరారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో ఈ ఘటన జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులను ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను కాట్రా, కాక్రయల్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. విషయం తెలిసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధితులకయ్యే ఖర్చును భరిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa