పంజాబ్ లో ప్రధాని మోడీని అడ్డుకొన్న ఘటనతో దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద దుమారం సాగుతుండగా ఆ రాష్ట్రంలో ఓ కీలక మార్పు చోటు చేసుకొంది. ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దుమారం రేగుతున్న సమయంలోనే కీలక మార్పు చోటుచేసుకుంది. పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయ స్థానంలో వీరేష్ కుమార్ భవ్రాను నియమించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఈ ప్రకటన వెలువడింది. వీరేష్ కుమార్ భవ్రా 1987 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. పంజాబ్ డీజీపీగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వంలో మూడో డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటన రద్దు అయింది. భద్రతలో లోపాలు కారణంగా మోదీ 20 నిమిషాలపాటు కాన్వాయ్లోనే ఉండిపోవడమే కాకుండా.. ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ డీజీపీ.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారని, కుట్ర పూరితంగానే ప్రధాని పర్యటనను అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనపై విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ముందు డీజీపీ చటోపాధ్యాయతో పాటు మరో 13 మంది పోలీసులు, సివిల్ అధికారులు శుక్రవారం ఫిరోజ్పూర్లో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్కు కొత్త డీజీపీని నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa