ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యం ఏలుతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 08, 2022, 11:43 PM

కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యం ఏలుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై చంద్రబాబు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా సి.బండ్లపల్లెలో జరుగుతున్న మైనింగ్‌ను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యం ఏలుతోందని మండిపడ్డారు.  అఖండ సినిమాలోనే ఇలాంటి మైనింగ్ దారుణమైన మాఫియాను చూశానని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ సినిమాకు మించిన రీతిలో ఇక్కడ మైనింగ్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని ఆరోపించారు. వీళ్లపై గ్రీన్ ట్రిబ్యునల్‌, న్యాయ స్థానానికి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ గ్రానైట్ అక్రమ డబ్బులను మున్సిపల్, పంచాయతీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే పదవి నుండి తొలగించాలని, అక్రమ మైనింగ్‌ను ప్రజలే అడ్డుకోవాలన్నారు. మైనింగ్ కుప్పం ప్రజల సంపదని, ద్రావిడ వర్సిటీలో 150 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో ఇన్ని జరుగుతుంటే పోలీసులు మైనింగ్ మాముళ్ల మత్తులో తూగుతున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి మాఫియా డాన్‌గా పనిచేస్తున్నారని, అక్రమ మైనింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa