ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా విళయ తాండవం: రోజుకు లక్షన్నరకు పైనే

national |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 01:34 PM

భారతదేశంలో కరోనా విస్తరణ నిశబ్ధంగా సాగుతోంది. వారాల వ్యవధిలోనే దేశంలో కరోనా విస్తరించి విళయ తాండవం చేస్తోంది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసులు శనివారం లక్షన్నర దాటాయి. శుక్రవారం కంటే 13 శాతం ఎక్కువ కేసులు నమోదయినా.. అంతకు ముందుతో పోల్చితే కాస్త తక్కువే. దేశవ్యాప్తంగా మొత్తం 1,59,377 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సెకెండ్ వేవ్‌లో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 31 నాటికి లక్ష ఉన్న యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం ఆరు లక్షలకు చేరాయి. మరోవైపు, మహమ్మారితో దేశంలో మరో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 41,434 కేసులు బయటపడగా... 13 మంది చనిపోయారు. ఒక్క, ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. రోజువారీ కోవిడ్ కేసుల్లో మహారాష్ట్రతో ఢిల్లీ పోటీ పడుతుంది. అక్కడ 20,181 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఏడుగురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ్ బెంగాల్‌లో కొత్తగా 18,802 కేసులు బయటపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మొత్తం 8,906 కొత్త వైరస్ కేసులు వెలుగు చూశాయి. కేరళలో ఒక్కరోజే 5,944 కేసులు నిర్ధరణ ఇదిలావుంటే 33 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 6,411, గుజరాత్‌లో 5,677, ఝార్ఖండ్‌లో 5,081, చత్తీస్‌గడ్‌లో 3,455, తెలంగాణలో 2,606 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో జనవరి 10 నుంచి మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 15 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ప్రకటించింది. అంతేకాదు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే అక్కడ బస్సుల్లో ప్రయాణించాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa