ఓ కిలాడీ దంపతులు బ్యాంకు నుంచి లోన్ పొందడం కోసం అన్నాచెల్లెళ్ల అవతారమెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన పవన్, ప్రభావతి దంపతులు ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. బ్యాంక్ లోన్ కోసం తనఖా పెట్టేందుకు ఎలాంటి ఆస్తి లేకపోవడంతో అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు. తనపేరు పల్లా వెంకటేశ్వర్లుగా ఆధార్ కార్డు మార్చుకొని, భార్యను చెల్లెలుగా మార్చేశాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నాచెల్లెళ్లుగా చెప్పుకొని నివాసముంటున్నారు.
ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలుసుకున్నారు. గ్రామంలోని రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూములు తమ పూర్వీకుల నుంచి వచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాదార్ పాసు పుస్తకాలు కూడా పొందారు. ఈ భూములు చూపించి నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని చైతన్య గోదావరి బ్యాంకు నుంచి గతేదాడిలో ఒక్కొక్కరు రూ.4.50 లక్షల చొప్పున లోన్ తీసుకున్నారు.
రుణానికి సంబంధి నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు అన్నాచెల్లెల్లు కాదని, భార్యాభర్తలని పోలీసులు తేల్చారు. దంపతులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మునయ్య, మల్లికార్జునరావు, జ్యోతిబాబుతో పాటు సంతమాగలూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే కిషోర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa