గెలిచే గుర్రానే ఎవరైనా కోరుకొంటారు. గెలిచే పార్టీలోనే ఎవరైనా చేరాలనుకొంటారు. విచిత్రం ఏమిటో గానీ యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు తేల్చినా ఆ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. గత మూడు రోజులలో బీజేపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గెడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఏడో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. బీసీ నేత ముఖేశ్ వర్మ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వామి ప్రసాద్ మౌర్య ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన తొలి నేత స్వామి ప్రసాద్ మౌర్యనే కావడం గమనార్హం. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ. తన రాజీనామా లేఖలో బీజేపీపై వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెనుకబడిన తరగతులను బీజేపీ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల గొంతుకగా ఆయన అభివర్ణించారు. ఆయనే తమ నాయకుడని అన్నారు. యూపీలో ఐదేళ్ల పాలనలో దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల గురించి బీజేపీ పట్టించుకోలేదని చెప్పారు. ఈ సామాజికవర్గాలకు చెందిన నేతలకు తగిన గౌరవాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు. రైతులు, నిరుద్యోగ యువత, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణాల వల్లే తాను బీజేపీని వీడుతున్నానని చెప్పారు. స్వామి ప్రసాద్ మౌర్య వెంట తాను ఉంటానని తెలిపారు. స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు పార్టీని వీడిన నేతలంతా కూడా ఓబీసీ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa