ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంతో వైసీపీకి ఉన్న ఒప్పందం ఏమిటో: రవీంద్రకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 08:12 PM

వైసీపీ సర్కారుకు కేంద్రంతో ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తామని అన్నారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం పెట్టకపోవడం ఏంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అజెండా మారడానికి కేంద్రానికి సీఎం జగన్ రాసిన లేఖనే కారణమని భావిస్తున్నట్టు కనకమేడల తెలిపారు. వైసీపీకి 28 ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రభుత్వానిది వైఫల్యమా? లొంగుబాటా? అని ప్రశ్నించారు. అసలు, వైసీపీ తీరుపై సందేహాలు కలుగుతున్నాయని, అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారని వ్యాఖ్యానించారు. హోదాపై మంచి పరిణామం ఎదురైతే వైసీపీకి, చెడు పరిణామం ఎదురైతే చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని కనకమేడల ఆరోపించారు. కేంద్రం హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏంటో చెప్పాలని అన్నారు. హోదాపై ఏవిధంగా ముందుకు పోదలుచుకున్నారో చెబితే, అందుకు టీడీపీ కూడా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ పోరాడితే టీడీపీ నేతలు కూడా కలిసి వస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, వారితో పాటు తాము కూడా రాజీనామాలు చేస్తామని కనకమేడల వెల్లడించారు. ఒకవేళ, హోదా సాధించడం వైసీపీ వల్ల కాదని జగన్ చెబితే, టీడీపీ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa