నటన చాలా సులువని.. దర్శకత్వం చాలా కష్టమని అంటారు సినీ జనాలందరూ. నటన అంటే ఒక క్రాఫ్ట్ మాత్రమే. దర్శకత్వం అంటే సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ నూ కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నటనతో పోలిస్తే దర్శకత్వం చాలా కష్టమన్నదే అందరి భావన. ఐతే ముందు నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులేసిన వెంకీ అట్లూరి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు. తనకైతే నటన చాలా కష్టంగా అనిపించిందని.. రచన, దర్శకత్వం చాలా తేలిగ్గా ఫీలయ్యానని అతనన్నాడు.
'స్నేహగీతం'లో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించిన వెంకీ.. 'జ్ఞాపకం' అనే సినిమాలో తనే కథానాయకుడిగా నటించాడు. 'స్నేహగీతం'కు రచయితగా కూడా పని చేసిన వెంకీ.. ఆ తర్వాత కొన్ని సినిమాలకు రైటింగ్ డిపార్ట్మెంట్లో పని చేశాడు. 'తొలి ప్రేమ'తో దర్శకుడిగా మారి సత్తా చాటుకున్నాడు. ఐతే యాక్టింగ్ అనేది తన కప్ ఆఫ్ టీ కాదని.. దాన్ని తాను ఎప్పుడూ ఆస్వాదించలేదని వెంకీ చెప్పాడు. 'స్నేహగీతం' సమయంలో ఒక సన్నివేశానికి ఐదారు వెర్షన్లు రాయమని అడిగినా.. పెద్దగా ఇబ్బంది పడలేదని.. కానీ నటుడిగా రెండో టేక్ చేయమంటే చాలా కష్టంగా అనిపించేదని వెంకీ చెప్పాడు.
అంతకంతకూ నటన కష్టంగా అనిపించడంతో ఇక దాని జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుని రచయితగా ఫిక్స్ అయిపోయానన్నాడు. ఆపై దర్శకత్వంలోకి వచ్చినట్లు చెప్పాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ కూడా తాను నటుడిగా కనిపించనని వెంకీ స్పష్టం చేశాడు. దర్శకుడిగా తన రెండో సినిమా 'మిస్టర్ మజ్ను' గురించి సమీక్షకులు విమర్శించినప్పటికీ సామాన్య ప్రేక్షకులు మాత్రం బాగా ఆస్వాదిస్తున్నారని.. సినిమా పెద్ద విజయం దిశగా వెళ్తోందని వెంకీ చెప్పాడు. త్వరలోనే తన మూడో సినిమాను ప్రకటిస్తానని అతనన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa