|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:18 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.పీఎంఏవై-అర్బన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి మొత్తం 1.13 లక్షల ఇళ్లను కేటాయించనుంది. ఇందులో ఇప్పటికే 10 వేల ఇళ్లు మంజూరు కాగా, మిగిలిన 1.03 లక్షల ఇళ్ల కోసం రూ.1,690 కోట్లు విడుదల చేయనుంది. ఇది కాకుండా గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి సుమారు 33 వేల ఇళ్లకు కేంద్రం తన వాటాగా మరో రూ.500 కోట్లు అందించే అవకాశం ఉంది.