ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీకూ ఆ మెస్సేజ్ వచ్చిందా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 04:32 PM

ప్రస్తుత కాలంలో.. స్మార్ట్ ఫోన్ వినియోగం చాలా పెరిగింది. దీంతో.. ప్రతి పనిని మొబైల్ ద్వారానే చేసుకుంటున్నారు జనాలు. ఆన్ లైన్ షాపింగ్ పేరుతో కూరగాయల దగ్గరి నుంచి ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కొత్తిమీర కట్ట కొన్నా.. డబ్బులకు బదులు యూపీఐ పేమెంట్సే చేస్తున్నారంటే.. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో.. తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులు అనో ఏదో విధంగా జనాలను బురిడీ కొట్టించి.. అందిన కాడికి దోచేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇదే క్రమంలోనే.. కొత్త మోసానికి తెరలేపారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట నకిలీ లింకులు పంపిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు.


"మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి.".. అంటూ తెలిసిన నెంబర్ల నుంచి ఓ మెస్సేజ్‌ వస్తుంది. ఆ మెస్సెజ్‌తో పాటు ఎస్‌బీఐ యోనో పేరురు ఓ లింకును కూడా పంపించగా.. దాన్ని నమ్మి క్లిక్ చేయటంతో.. క్షణాల్లోనే సదరు వినియోదారుని ఖాతాలోని డబ్బులన్ని మాయం అవుతున్నాయి.


ఇందులో భాగంగానే.. నిర్మల్‌‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ అనే వీడియోగ్రాఫర్‌ వాట్సప్‌ నెంబరు నుంచి అతనికే తెలియకుండా.. పలు గ్రూపులకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట మెస్సేజ్ వెళ్లింది. ఈ మెస్సేజ్‌తో పాటు ఓ లింకు కూడా పంపించటంతో.. ఎందుకిలా పంపిస్తున్నాడని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ గ్రూపుల్లోని కొందరు ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఆరా తీయగా.. తాను పంపించలేదని చెప్పటంతో.. విస్తుపోయారు. ఎవ్వరూ ఆ లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పటంతో.. అందరూ అప్రమత్తమయ్యారు.


జైనూరు మండలం శివునూర్‌కు చెందిన ఓ యువ రైతుకు కూడా తమ గ్రామం పేరిట ఉన్న వాట్సప్‌ గ్రూపులో ఎస్‌బీఐ రివార్డ్స్‌ లింకు రావడంతో నిజమని నమ్మి క్లిక్ చేశాడు. దీంతో.. అతని ఖాతా నుంచి క్షణాల్లోనే 50 వేలు డ్రా అయినట్లు మెస్సేజ్ రావడంతో షాక్ అవ్వటం అతని వంతైంది. ఇదే విషయాన్ని వెంటనే.. పోలీసులకు, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రివార్డ్స్ పేరిట వాట్సప్‌ గ్రూపుల్లో లింకులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో చాలా మంది నిజమని నమ్ముతున్నారు. దీంతో.. సులువుగా నమ్మి మోసపోతున్నారు.


దీంతో.. ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట వస్తున్న సందేశాలు.. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా సరే వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి లింకులతో మెస్సేజులు వస్తే.. అస్సలు తెరవకూడదని హెచ్చరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa