తెలంగాణలోనే కాదు దేశమంతా సంచలనంగా మారిన అంశం.. జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్. డిసెంబర్ 04న పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. అల్లు అర్జున్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. ఆయనను ఏ11గా పేర్కొంటూ అరెస్ట్ చేయటమే కాకుండా చంచల్ గూడా జైలుకు కూడా తరలించారు. అయితే.. హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో.. అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు జీవితం తర్వాత బయటికి వచ్చారు. కాగా.. దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది.
సినిమా వాళ్లలో చాలా వరకు అల్లు అర్జున్ అరెస్టును ఖండించగా.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కారును నిందిస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ అత్యుత్సాహమే కనిపిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఓ ప్రాణం పోయిందని, మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని.. ఇలాంటి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని.. అందుకు బాధ్యుడైన ఆ సినిమా స్టార్ను అరెస్ట్ చేయటంలో తప్పేమీ లేదని ప్రభుత్వం సమర్థించుకుంటుండగా.. రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలను ప్రతిపక్ష నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో.. ఇటీవల జరిగిన ఓ ఘటనను ప్రస్తావించిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఏ11 అయితే.. ఇందులో కూడా రేవంత్ రెడ్డి ఏ11 కావాలిగా అంటూ లాజిక్ లాగారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. సవివరమైన పోస్ట్ పెట్టారు ఆర్ఎస్పీ.
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా.. ఆ మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెరపైకి తీసుకొచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మరణాన్ని, మెదక్ ప్రమాద ఘటనలో ఇద్దరు చనిపోవటాన్ని పోల్చుతూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆర్ఎస్పీ. ఈ రెండు సంఘటనల్లో వేర్వేరు న్యాయాలు ఉండకూడదని.. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఇద్దరూ ప్రమఖులేనని చెప్పటమే కాదు.. ఆ ఘటనలో అల్లు అర్జున్ ఏ11 అయినప్పుడు మెదక్ ఘటనలో రేవంత్ రెడ్డి కూడా ఏ11 కావాలె కదా అంటూ గట్టి లాజికే లాగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టిన ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. కరెక్ట్ లాజిక్ లాగారు సర్.. అంటూ కొంత మంది నెటిజన్లు స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భమంటూ కొందరు, అది స్వయంగా అల్లు అర్జున్ పబ్లిసిటీ స్టంట్ వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిందని.. ఇలాంటివి రోజూ చాలా జరుగుతాయని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ అగ్గిరాజేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa