వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి పులివెందులకు వర్రా రవీందర్ కేసు బదిలీ అయ్యింది. వర్రా రవీందర్ రెడ్డిపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పెట్టిన కేసు ప్రస్తుతం పులివెందులకు బదిలీ అయ్యింది. గత ఏడాది ఫిబ్రవరిలో సునీతను వ్యక్తిత్వ హననం చేస్తూ అసభ్యంగా వర్రా పోస్టులు పెట్టిన విషయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేసింది. సునీత ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును పులివెందులకు బదిలీ చేశారు పోలీసులు. దీంతో పులివెందుల పోలీసులు వర్రా రవీందర్రెడ్డిపై కొత్తగా కేసు నమోదు చేశారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రా కడప సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగాఉన్నాడు.