ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ప్రతి పార్టీ తమ అగ్రనాయకులను రంగంలోకి దింపుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో జోరుగా ప్రచారం సాగుతోంది. పోటాపోటీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల నేతలతో నేడు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామని తెలిపారు. ఫిభ్రవరి 27న జరిగే ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఆదేశించారు.