నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.ఇటీవలే జగన్ లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.