భారత్ పాక్ సరిహద్దుల్లో భారీ పేలుడు సంభవించింది. జమ్మూ కాశ్మీర్లో ఐఈడీ పేలుడు సంభవించింది. అక్నూర్ సెక్టార్లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ సమయంలో భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అక్నూర్ సెక్టార్లోని లాలియాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్-ఐఈడీ పేలినట్లు సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ కాస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలిపింది. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులకు వైట్ నైట్ కార్ప్స్ ట్విటర్ వేదికగా సెల్యూట్ చెప్పింది. వారి త్యాగాలు గుర్తుండిపోతాయని పేర్కొంది.
ఈ ఘటనను భద్రతా బలగాలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇవాళ అక్నూర్ సెక్టార్లో మోర్టార్ షెల్ను భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. నమందార్ గ్రామంలోని ప్రతాప్ కెనాల్ వద్ద ఈ మోర్టార్ షెల్ను చూసిన స్థానికులు సైన్యానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం.. ఆ మోర్టార్ షెల్ పేలకముందే దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు.. ఇటీవలే ఉత్తర కాశ్మీర్లోని బంధిపొర జిల్లాలో ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం.. ఎస్కే పయీన్ ప్రాంతంలో మూలమలుపు వద్ద రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతిచెందటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
![]() |
![]() |