ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీ సమాచారాన్ని అందించిన డెలివరీ బాయ్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 03:29 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక వ్యాపారి ఇంట్లో రూ. 50 లక్షల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో సదరు వ్యాపారి కుటుంబంతో సహా వేరే ప్రాంతానికి వెళ్లారు. కాగా చోరీ జరిగిన విషయాన్ని ఒక కొరియర్ బాయ్ ఆ వ్యాపారికి చేరవేశాడు. వివరాల్లోకి వెళితే వ్యాపారి రాజీవ్ దానియా తన కుటుంబంతో పాటు కీర్తినగర్ ఎం బ్లాక్‌లో ఉంటున్నారు. అతను పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం ఏదో పనిమీద కుటుంబంతో సహా గురుగావ్ వెళ్లారు. సాయంత్రం ఆర్డర్ ప్యాకెట్ తీసుకుని డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడు. అతను డోర్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎవరూ రాలేదు. దీంతో ప్యాకెట్ మీద ఉన్న నంబరుకు ఫోన్ చేసి తలుపులు తెరిచివున్నా, ఎవరూ లోపలి నుంచి రావడం లేదని వ్యాపారికి చెప్పాడు. దీంతో ఆ వ్యాపారి వెంటనే పంజాబీబాగ్‌లోని కుమార్తెకు ఫోన్ చేశాడు. ఆమె వెంటనే వ్యాపారి ఇంటికి చేరుకుంది. ఆమె లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని సామానంతా చిందరవందరగా పడివుంది. బీరువా కూడా తెరిచివుంది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రూ. 40 లక్షల నగదు, 10 లక్షల విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa