ఎప్పటినుంచో సోషల్ మీడియాను నియంత్రించాలని డిమాండ్లు ఉన్నాయి. ఇక చిన్న పిల్లలు ఉపయోగించే సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు తీసుకురావాలని ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 ముసాయిదాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రచురించింది. ఇందులో కీలక నిబంధనలు తీసుకురానుంది. పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్- 2023 ముసాయిదా నిబంధలన ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని కొత్త నిబంధనలు తీసుకురానుంది.
ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్- 2023 ముసాయిదాపై ఫిబ్రవరి 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. అప్పటివరకు వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. వాటి ఆధారంగా ఈ ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. MyGov.in వెబ్సైట్ ద్వారా ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్- 2023 ముసాయిదా నిబంధనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను సమర్పించాలని తెలిపింది.
ఈ కొత్త సోషల్ మీడియా రూల్స్ పిల్లల వ్యక్తిగత డేటాను కాపాడేందుకు ప్రయత్నిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డేటా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు పిల్లల వ్యక్తిగత వివరాలను తీసుకోవడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. డేటా రక్షణ కోసం ముసాయిదా నిబంధనల్లో కేంద్రం.. పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ముందు డేటా సేకరణ సంస్థ ద్వారా తల్లిదండ్రుల ధృవీకరణ అనుమతి పొందాలని పేర్కొంది.
తల్లిదండ్రులు ఆమోదించిన తర్వాతే వారి పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించి.. వారికి సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయాలని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు.. పిల్లల డేటాపై దృష్టి సారించడంతో పాటు, ముసాయిదా నియమాలు మెరుగైన వినియోగదారుల హక్కులను ప్రతిపాదిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యూజర్లు తమ డేటాను తొలగించాలని సదరు సోషల్ మీడియా సంస్థను డిమాండ్ చేయడానికి.. వారి డేటాను ఎందుకు సేకరిస్తున్నారు అనేది తెలుసుకునేందుకు పారదర్శకత ఉంటుందని పేర్కొంది. ఇక ఈ కొత్త సోషల్ మీడియా రూల్స్ను ఉల్లంఘిస్తే సదరు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు రూ. 250 కోట్ల వరకు జరిమానాను విధించాలని ఆ ముసాయిదాలో ప్రతిపాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa