రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల తరువాత ఎదుర్కొంటూ వచ్చిన ప్రతి ఎన్నికలనూ తెలుగుదేశం పార్టీకి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. శాసన సభ, లోక్సభ ఎన్నికలు మొదలుకుని మొన్నటిదాకా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలను చవి చూసిందా పార్టీ. సర్పంచ్, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో ఆ పార్టీకి ఉన్న ప్రాతినిథ్యం నామమాత్రమే. ఈ వరుస ఓటముల నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది తెలుగుదేశం.
ఈ పరిణామాల మధ్య- తన ఆధీనంలో ఉంటూ వచ్చిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ను కూడా జారవిడుచుకుంది. టీడీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు తిరుగుబాటు లేవనెత్తడం దీనికి ప్రధాన కారణమైంది. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడానికి నిర్వహించిన ఎన్నికలను టీడీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లెవరూ కొత్త మేయర్ ఎంపిక ప్రక్రియకు హాజరు కాలేదు. దీనితో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మేయర్ స్థానాన్ని గెలుచుకోగలిగింది.
కాకినాడకు చెందిన వైసీపీ నాయకురాలు, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర్ శివప్రసన్న మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అదే పార్టీకి చెందిన మీసాల ఉదయ్ కుమార్ను వైసీపీ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికను బహిష్కరింంచారు. వారు గైర్హాజర్ కావడంతో శివప్రసన్న, ఉదయ్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
2017లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్పొరేషన్ ఎన్నికలో టీడీపీ హవా బలంగా వీచింది. మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లకు ఎన్నికలను నిర్వహించారు. టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ, ఇండిపెండెంట్లు మూడు చొప్పున డివిజన్లను గెలుచుకున్నారు. అప్పట్లో టీడీపీ మేయర్గా సుంకర పావని ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్గా గెలిచిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తటస్థంగా ఉంటూ వచ్చింది. క్రమంగా మేయర్ సుంకర పావని వ్యవహారశైలిపై టీడీపీ కార్పొరేటర్లలో అసంతృప్తి చెలరేగింది.
ఆమె వైఖరిని నచ్చక విభేదించారు. ఈ క్రమంలో టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. దీంతో పావని పదవిని కోల్పోయారు. మెజారిటీ కార్పొరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈ మేరకు ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa