ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ను అడ్డుకొనేలా ఇజ్రాయేల్ గుఢాచార్యం

international |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 08:23 PM

పాకిస్తాన్ దేశాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయేల్ తన గుఢాచార్య వ్యవస్థలు పలు  సంవత్సారాలనుంచి నిర్వహిస్తోందని తాజాగా వెల్లడైంది. పాలస్తీనాకు ఇస్లామిక్ దేశాల మద్దతు ఇవ్వడం వల్ల 1948 నుంచి వారితో ఇజ్రాయేల్‌కు సంబంధాలు తెగిపోయాయి. కాలక్రమేణా చాలా దేశాలతో సంబంధాలు మెరుగుపడినా పాకిస్థాన్ సహా మరో 28 దేశాలు మాత్రం ఇజ్రాయేల్‌ను గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, పాక్ అణు కార్యకలాపాలను అడ్డుకోడానికి ఇజ్రాయేట్ గూఢచారి సంస్థ దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసినట్టు స్విస్ పత్రిక ఎన్‌జెడ్‌జెడ్ సంచలన కథనం వెలువరించింది. 80వ దశకంలో జర్మనీ, స్విట్జర్లాండ్ సహకారంతో పాక్ చేపట్టిన అణు కార్యక్రమాలను అడ్డుకట్ట వేయాలని చూసిందని తెలిపింది. పాక్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఇజ్రాయేల్ గూఢచారి సంస్థ మొసాద్.. ఈ క్రమంలో దాని మిత్రదేశాలకు చెందిన సంస్థలను కూడా ధ్వంసం చేయడానికి వెనుకాడలేదని పేర్కొంది. తొలుత ఆయా కంపెనీలకు నచ్చజెప్పి చూసిన మొస్సాద్‌.. మాట వినకపోవడంతో వారి యూనిట్లనే బాంబులతో పేల్చేసిందని వివరించింది. 80వ దశకంలో ఇరాన్‌-పాకిస్థాన్‌ కలిసికట్టుగా అణ్వాయుధ అభివృద్ధిపై పనిచేసినట్లు మొస్సాద్‌ అనుమానించింది.


బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత్ మద్దతుగా నిలవడంతో పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఇది జరిగిన రెండేళ్లకే 1974లో భారత్‌ ‘స్మైలింగ్‌ బుద్ధ’ పేరిట అణు పరీక్షలు నిర్వహించింది. భారత్‌ అణుపరీక్షలతో పాక్‌ వెన్నులో వణుకుపుట్టింది. వాస్తవానికి పాక్‌ 1953లోనే ‘ది పాకిస్థాన్‌ అటామిక్‌ ఎనర్జీ కమిటీ’ని ఏర్పాటు చేసి అణు శిక్షణ ఆరంభించింది. పాక్‌ తొలి ‘స్విమ్మింగ్‌పూల్‌’ రియాక్టర్‌ను 1965లో ప్రారంభించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో కుష్వంత్‌ సింగ్‌ రాసిన కథనం ‘ఫారెన్‌ అఫైర్స్‌ పాకిస్థాన్‌-ఇండియా అండ్‌ ది బాంబ్‌’లో పేర్కొన్నారు.


అప్పటికే భారత్‌తో రెండు యుద్దాల్లో ఓడిపోయినా పాక్‌‌కు బుద్ధి రాలేదు. ‘‘అవసరమైతే గడ్డయినా తింటాం లేదా పస్తులుంటాం.. కానీ అణు బాంబును సొంతగా తయారు చేస్తాం.. మాకు వేరే మార్గం లేదు’’ అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసింది. నెదర్లాండ్ అణు సాంకేతికతను 1976 నాటికే తస్కరించిన డాక్టర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌.. దీనికి సంబంధించిన బ్లూప్రింట్లు, అణు పరికరాల సరఫరాదారుల జాబితాలను సేకరించి పాక్‌ అణు కార్యక్రమంలో చేరాడు. ఖాదిర్ ఖాన్ 1970లో బ్రిటన్-నెదర్లాండ్-జర్మన్ యురేనియం శుద్ధి ప్రాజెక్టు కార్యక్రమంలో పనిచేసి.. సాంకేతికతను తస్కరించి పాక్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో ఇరాన్‌ కూడా అణ్వాయుధాల కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఇరాన్-పాకిస్థాన్‌లు 1980ల ప్రారంభంలో సంయుక్తంగా అణుబాంబు అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆ సమయంలో జర్మనీ, స్విట్జర్లాండ్‌లోని కొన్ని సంస్థలు డబ్బుకు కక్కుర్తిపడి ఇరాన్‌కు సహకరించాయి. 1987లో పాక్‌ అణు పితామహుడు డాక్టర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌, ఇరాన్‌ న్యూక్లియర్‌ కమిషన్‌ చీఫ్‌ మసూద్‌ నరాఘీలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో భేటీ అయ్యారు. మసూద్‌ వెంట జర్మన్‌ ఇంజినీర్లు గాటర్డ్‌ లెర్చ్‌, హెయిన్జ్‌ మెబస్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత దుబాయ్‌, యూఏఈలోనూ సమావేశమయ్యారు. పాక్ అణ్వాయుధ కార్యక్రమానికి బ్రేక్‌లు వేయాలని భావించిన అమెరికా.. ఈ విషయంలో జర్మనీ, స్విస్‌ ప్రభుత్వాల సాయం కోరింది. పాక్‌కు సహకరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరినా.. ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇజ్రాయేల్ గూఢచారి సంస్థ మొసాద్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. పాక్, ఇరాన్‌లకు సహకరిస్తోన్న సంస్థలు, సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు 1981లో పలు దాడులు చేశారు. తొలుత ఫిబ్రవరి 20న కోరా ఇంజినీరింగ్‌ చుర్ సంస్థ కీలక ఉద్యోగి ఇంట్లో బాంబును పేల్చారు. ఆ తర్వాత మే 18న వాలిష్మిల్లర్‌ ఫ్యాక్టరీ భవనం.. ఎర్లాంజెన్‌లోని హంజ్‌ మెబస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాన్ని పేల్చివేశారు. ఇదే సమయంలో అణు సాంకేతికను అందజేసే మిగితా కంపెనీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ఇంగ్లిష్‌, పొడి పొడి జర్మనీ పదాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపు కాల్స్‌ను రికార్డ్‌ చేసుకోమని కూడా సలహా ఇవ్వడం గమనార్హం. వాలిష్మిల్లర్‌ కంపెనీకి జరిగిందే మీకు కూడా జరుగుతుందని హెచ్చరించారు. లేయ్‌ బోల్డ్‌-హీరేయస్‌ ఆఫీసు, ‘వీఏటీ’ కంపెనీ యజమాని, ఇతర ఉద్యోగులకు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. జర్మనీలోని రాయబార ఉద్యోగి తమను అణుపరికరాల వ్యాపారం వదిలేసి వస్త్రపరిశ్రమ నిర్వహించుకోమని హెచ్చరించినట్లు ‘వీఏటీ’ సంస్థ యజమాని స్విస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పేలుళ్ల వెనుక మొసాద్‌ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా సరైన సాక్ష్యాలు లభించలేదు. అయితే,‘ది నాన్‌-ప్రోలిఫరేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా’ ఈ పేలుళ్లకు బాధ్యత వహించింది. కానీ, ఈ సంస్థ వివరాలు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. మొసాద్‌పై దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. పాక్ అణు పితామహుడు ఖాదిర్ ఖాన్ నెట్‌వర్క్‌తో అప్పట్లో స్విస్‌, జర్మన్‌ కంపెనీలు అంటకాగాయి. కేవలం ఇచ్చే మిలియన్ల డాలర్ల కోసం ఆశపడి పౌర-అణు సాంకేతికతను వినియోగించే పరికరాలను ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో సరఫరా చేసినట్లు ది ఎన్‌జడ్‌జడ్‌ పత్రిక పేర్కొంది. లేబోల్డ్‌ హీరేయస్‌, వాలిష్మిల్లర్‌, కోరా ఇంజినీరింగ్‌ చుర్‌, బచ్‌ మెటల్‌ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. పౌర అణు సాంకేతిక పరికరాల విక్రయం విషయంలో జర్మన్‌, స్విస్‌ అధికారులు ఉదారంగా వ్యవహరించారు. ఈ కంపెనీలు విక్రయించిన పరికరాల్లో యురేనియం శుద్ధిచేసే హైప్రెసిషన్‌ వాక్యూమ్‌ వాల్వ్‌ వంటివి ఉన్నట్లు తేలింది. వీటి అమ్మకాలపై స్విస్‌, జర్మనీలకు అమెరికా పంపిన హెచ్చరికలు వాషింగ్టన్‌లోని నేషనల్‌ సెక్యూరిటీ ఆర్కైవ్స్‌లో ఇప్పటికీ ఉన్నాయి. పాక్‌కు ఆయా కంపెనీల నుంచి పంపుతున్న పరికరాలపై నిఘాను స్విట్జర్లాండ్‌ పూర్తిగా గాలికొదిలేసిందని అమెరికా మండిపడింది. జర్మనీ, స్విస్‌ దేశాలకు చెందిన చెరో అర డజను కంపెనీల నుంచి అణు పరికరాలు పాక్‌కు చేరినట్లు గుర్తించారు. 18 సంవత్సరాల నుంచి రహస్యంగా సాగిన ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమానికి క్లిష్టమైన అణు పరిజ్ఞానం, పరికరాలను అందించినట్టు పాకిస్థాన్ మొదటిసారిగా 2003లో ధ్రువీకరించింది. ఇరాన్‌తో తాము అణు కార్యక్రమంలో పాల్గొనలేదని కొద్ది రోజుల్లోనే పాక్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa