ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తినడానికి లేకున్నా...అణు ప్రయోగాలకు సిద్దమైంది

international |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 08:26 PM

ఉత్తర కొరియాలో నియంత పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు.  తాజాగా ఆ దేశంలో తినడానికి తిండి లేక  ప్రజలు అలమట్టిస్తోంటే ఆ దేశంలోని ప్రభుత్వం మాత్రంం అణు ప్రయోగాలు చేయడం విమర్శలకు తావ్విస్తోంది. ఓవైపు అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు కోవిడ్ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో ఉత్తర కొరియా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కురుకుపోయింది. తినడానికి తిండిలేక ప్రజలు అల్లాడిపోతుంటే, ఆ దేశాధినేతకు ప్రజల ఆకలి కేకలు ఏమాత్రం పట్టడం లేదు. వరుస అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. మరో హైపర్ సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా బుధవారం పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. నిర్దేశించిన 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితంగా చేధించినట్టు తెలిపింది. అక్టోబరు 2021లోనూ ఉత్తర కొరియా ఈ రకం క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే. బాలిస్టిక్‌ క్షిపణులు, న్యూక్లియర్‌ ఆయుధాల పరీక్షలపై ఆంక్షలు కొనసాగుతున్నా కిమ్ వెనక్కు తగ్గడంలేదు. 2022లో ఉత్తరకొరియా చేసిన తొలి ఆయుధ పరీక్ష ఇదే. లాంచింగ్ పాడ్ నుంచి బయలుదేరి 120 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత హైపర్‌సోనిక్ క్షిపణి వార్‌హెడ్ దాని రాకెట్ బూస్టర్ నుంచి వేరుపడి లక్ష్యాన్ని కచ్చితంగా తాకిందని కేసీఎన్ఏ పేర్కొంది. ఈ పరీక్షలో విమాన నియంత్రణ, ప్రతికూల వాతావరణంలో పనిచేసే సామర్థ్యం కూడా నిర్ధారించినట్టు వివరించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగం లేదా గంటకు 6,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ ఆయుధాలు సాధారణంగా బాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను చేధించడానికి అనువుగా ఉంటాయి. ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్షను జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తొలిసారి గుర్తించారు. తాజా పరీక్షను దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయాన్ని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ కూడా ధ్రువీకరించింది. జపాన్‌ రక్షణశాఖ మంత్రి నుబవు కిషి దీనిపై స్పందిస్తూ 'ఉత్తర కొరియా క్షిపణి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.. ఇది దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. తమ రక్షణ వ్యవస్థలను మరింత శక్తివంతం చేయడాన్ని కొనసాగిస్తామని కొత్త ఏడాది ప్రసంగంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్ష చేపట్టడం గమనార్హం. అమెరికా, చైనా సహా ఉత్తర కొరియా వంటి కొద్ది దేశాలు మాత్రమే హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసి పరీక్షలు నిర్వహించాయి. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా కారణంగా సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతోంది. ఉత్తర కొరియాలో పిల్లలు, వృద్ధులు పరిస్థితి దయనీయంగా మారిందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa