ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మాహుతి దళం కూడా తప్పదు మరి

international |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 08:28 PM

ఐఎస్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు అఫ్గన్ సైన్యంలో ఆత్మాహుతి దళాన్ని అధికారికంగా చేర్చాలని తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గనిస్థాన్‌లో మళ్లీ అధికారం చేపట్టిన తాలిబన్లకు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కంటిలో నలుసుగా తయారయ్యారు. ఇటీవల కాలంలో అఫ్గన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులకు ఐఎస్ బాధ్యత వహించింది. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి’ అన్నట్టుగా గత 20 ఏళ్లుగా అమెరికా సైన్యాలపై తాలిబన్లు ఈ తరహా దాడులకు పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడులే వారి ప్రధాన ఆయుధం. ఈ నేపథ్యంలో ఐఎస్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు అఫ్గన్ సైన్యంలో ఆత్మాహుతి దళాన్ని అధికారికంగా చేర్చనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలు అఫ్గన్- అమెరికా సైన్యాలతో యుద్ధం చేసిన తాలిబన్లు.. ఆత్మాహుతి దళాన్నే ప్రధానంగా నమ్ముకున్నారు. మరోసారి ఆ వ్యూహాన్ని అమలుచేసి ఐఎస్‌ను తిప్పికొట్టాలని భావిస్తున్నారు. అఫ్గనిస్థాన్‌ను రక్షించడానికి దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న ఆత్మాహుతి బాంబర్ల స్క్వాడ్‌లను ఒకే గొడుగు కింద పనిచేసేలా సంస్కరించాలని కోరుకుంటున్నామని తాలిబన్ డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ తెలిపారు. ఆగస్టులో అమెరికా సైన్యం వైదొలిగిన తర్వాత అధికారాన్ని చేపట్టిన తాలిబన్లకు ఇస్లామిక్ స్టేట్ స్థానిక శాఖ ఇప్పుడు ప్రధాన లక్ష్యం. ఆగస్టు నుంచి చాలా ఆత్మాహుతి దాడులు జరిగాయి. ‘ఆత్మాహుతి దళం కలిగి ప్రత్యేక బలగాలను మరింత అధునాతనమైన.. ప్రత్యేక కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నాం’ అని కరీమీ ఫోన్ ద్వారా చెప్పారు. దేశవ్యాప్తంగా, సరిహద్దుల వద్ద ఆత్మాహుతి బాంబర్లు సాయంతో భద్రతను బలోపేతం చేసేలా వ్యవస్థీకృత సైన్యాన్ని నిర్మిస్తున్నామని కరీమి వివరించారు. దాదాపు 150,000 మంది యోధులు సైన్యంలో చేరాలని తాలిబాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఖారీ ఫసిహుద్దీన్‌ పిలుపునిచ్చినట్టు గతేడాది నవంబర్‌లో అల్ జజీరా ఓ కథనాన్ని వెలువరించింది. ‘తాలిబాన్ సైనిక శ్రేణులను ప్రక్షాళన చేసిన తర్వాత ఆత్మాహుతి దళం రిక్రూట్‌మెంట్ అంశం తెరపైకి వచ్చింది.. తాలిబన్ సైన్యంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ చొరబాటుదారులను గుర్తించడం, పట్టుకోవడం ప్రారంభించాం’ అని అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహెద్ తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు తాలిబన్‌లను నిరంతరం సవాల్ చేస్తూనే ఉన్నారు. అఫ్గన్‌లో మరో అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన నెలకొంది. గతేడాదది ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికుల సహా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa