ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలం

national |  Suryaa Desk  | Published : Thu, Jan 13, 2022, 01:38 PM

ఎన్నికలు సమీపించే కొద్ది కేంద్ర ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలను తీసుకొంటోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను రాయితీలు కల్పించాలన్న డిమాండ్ల పట్ల కేంద్ర సర్కారు సానుకూలంగా ఉంది. మౌలిక రంగ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసిన ప్రాజెక్టులను ట్రస్ట్ కిందకు బదలాయించి వాటిపై నిధులు సమీకరించుకుంటాయి. తద్వారా ఆ నిధులతో అవి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది. ట్రస్ట్ ల కింద ప్రాజెక్టులపై వచ్చే ఆదాయాన్ని ఇన్వెస్టర్లకు రాబడి రూపంలో పంచుతుంటాయి. మౌలిక రంగ సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంపై కేంద్రంలోని మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. భారత్ ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు భారీగా నిధుల అవసరం ఉంటుంది. అందుకనే ఇన్విట్ వంటి సాధనాలకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తే ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తారని.. తద్వారా ప్రాజెక్టులకు నిధుల సమస్య ఉండదని సర్కారు అంచనా. ప్రస్తుతం ఇన్విట్ లలో మూడేళ్లకు మించిన పెట్టుబడులపై లాభాలు వస్తే 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఈ పన్నును గణనీయంగా తగ్గించాలని విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వానికి సూచనలు అందాయి. దీంతో రానున్న బడ్జెట్ లో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇన్విట్ లు పంపిణీ చేసే డివిడెండ్ పైనా పన్ను తగ్గించాలన్న డిమాండ్ ఉంది. దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa