ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ న్యాయస్థానంలో పుతిన్ పై విచారణ ప్రారంభం

international |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 01:47 PM

అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న రష్యా దేశాధినేత పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ  జరగబోతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను నిరసిస్తూ యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ సోమవారం వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్‌లోని పరిస్థితిపై వీలైనంత వేగంగా దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని ఈ రోజు నేను ప్రకటించాలను కుంటున్నాను’’ అని ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘2014 నుంచి ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు రెండూ జరిగాయని నమ్మడానికి సహేతుకమైన ఆధారం ఉందని నేను సంతృప్తి చెందాను.. ఇటీవలి రోజుల్లో సంఘర్షణ విస్తరించినందున ఉక్రెయిన్ భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా ఏ పక్షంగా దాడులకు పాల్పడితే నా కార్యాలయ పరిధిలోకి వచ్చే ఏవైనా కొత్త ఆరోపణ నేరాలను కూడా ఈ దర్యాప్తులో చేర్చాలనేది నా ఉద్దేశం’’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు రష్యా దండయాత్రకు సంబంధించిన అనేక వచ్చాయని, అయితే ఐసీసీ స్థాపించిన రోమ్ శాసనంపై రష్యా, ఉక్రెయిన్ సంతకం చేయనందున ఈ నేరారోపణలపై అధికార పరిధిని ఉపయోగించలేమని ఖాన్ గత వారం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఆ దేశానికి చెందిన మరో 26 మందిపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది. వారిలో ఒలిగార్క్‌లు, సీనియర్ అధికారులు, పలు బీమా సంస్థలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 680 మంది లక్ష్యంగా ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఇరుకున పెట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో పనిచేసే 12 మంది రష్యా దౌత్యవేత్తలను తాజాగా అమెరికా బహిష్కరించింది. వారంతా తమ విధులకు అనుగుణంగా పనిచేయడంలేదని అమెరికా పేర్కొంది. ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా కూడా వీరిలో ఉన్నారు. ఐరాస నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని నెబెంజియా విమర్శించారు. ఇదే సమయంలో రష్యాలో తాము చేస్తున్న వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు చమురు ఉత్పత్తి దిగ్గజం షెల్‌ ప్రకటించింది. రష్యా ప్రభుత్వ సంస్థ గాజ్‌ప్రోమ్‌ సహా అనేక సంస్థల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. నార్డ్ స్ట్రీమ్‌-2 పైప్‌లైన్‌ ప్రాజెక్టు నుంచి కూడా వైదొలుగుతున్నట్లు షెల్ సంస్థ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa