|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 07:22 PM
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ నుంచి ఈ చీరల పంపిణీపై అనేక వార్తలు వస్తున్నాయి. బతుకమ్మ పండుగకే చీరల పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే అప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఈ చీరలను పంపిణీ చేశారు. చాలా మందికి చీరలు పంపిణీ చేయలేదు. ఈక్రమంలో మంత్రి సీతక్కతో సహా పలువురు అధికారులు కూడా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై అనేక పర్యాయాలు ప్రకటన చేశారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తారని ప్రకటించారు. కానీ ఈసారి కూడా వాయిదా పడింది. ఈక్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్లా కలెక్టర్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు. .
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని ఆమె ప్రకటించారు. ఈ చీరల ఉత్పత్తికి సంబంధించి వాటి పురోగతిని తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి వచ్చిన జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఆమె సమావేశం అయ్యారు
ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరా మహిళా శక్తి చీరల పథకం వల్ల.. సిరిసిల్లలోని వేలాది మంది నేతన్నలకి చేతి నిండా ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమం వల్ల వస్త్ర పరిశ్రమకు కూడా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తేనే.. వారి కుటుంబంతో పాటు.. సమాజ అభివృద్ధి కూడా సాధ్యమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని.. అందుకే ప్రభుత్వం ప్రారంభించే ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేస్తోంది అని తెలిపారు.
అనంతరం గరిమా అగర్వాల్.. సిరిసిల్లలోని వెంకట్రావునగర్లో మరమగ్గాల యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంతో పాటు.. గీతానగర్లో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ను కూడా పరిశీలించారు. పలు జిల్లాల మహిళా సంఘాల సభ్యులతో కలిసి మరమగ్గాలపై ఉత్పత్తి అవుతున్న చీరల తయారీని పరిశీలించారు. వీటి ఉత్పత్తి పూర్తి కాగానే రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.