|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:02 PM
మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన-ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం అంటూ విమర్శలు గుప్పించారు.
ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్లు అరెస్ట్ కాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన ఆరోపణలకు తెరతీశారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్ అవినీతికి అడ్డాగా మారిపోయిందని బీజేపీ చెప్పిందని పేర్కొన్న.. ఆ కేసును సీబీఐకి అప్పగించామని ఆ కేసు ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని బీజేపీని తాను అడుగుతున్నట్లు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లను కిషన్రెడ్డి కాపాడుతున్నారని.. కిషన్రెడ్డి కాస్తా ఇప్పుడు కల్వకుంట్ల కిషన్రావుగా మారారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు కార్పొరేటర్లుగా ఉంటే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తాను అందరివాడినని.. కులం, మతం లేదని పేర్కొన్నారు. గొప్ప నాయకులను అందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాకు ఉందని.. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో నిజామాబాద్ మురికి కూపంగా మారిపోయిందని మండిపడ్డారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ను రెండు సార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించినా.. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ నిజామాబాద్కు ఏమీ చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా.. నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు.