ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ స్పీకర్‌కు కేబినెట్ హోదా.. మండలి ఛైర్మన్‌ కొడుకుకు కీలక బాధ్యత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 10:21 PM

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి.. ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఇచ్చిన మాట మేరకు.. కీలక పదవి ఇచ్చారు సీఎం రేవంత్. పోచారం శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. కేవలం సలహాదారుడి నియమించటమే కాకుండా.. కేబినెట్ హోదాను కూడా కల్పించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు.. ప్రస్తుత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 టీడీపీలో సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన సీనియర్ నేత.. పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2018లో రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలోనూ... అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోచారం విజయం సాధించినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ అమల్లోకి రాకపోవటంతో కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.


పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన బీఆర్ఎస్‌లో ఉంటే తనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో పోచారం సొంతగూటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో.. జూన్‌ 21న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరే సమయంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కీలక హామీ ఇచ్చారు. పోచారం సీనియార్టీకి తగ్గట్టుగానే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారు. కాగా.. ఇచ్చిన మాట ప్రకారం పోచారం శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే.. ఆయనను కేబినెట్ హోదాతో సలహాదారుడిగా నియమించటం విశేషం.


మరోవైపు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి.. తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా వ్యవహరించారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించిన గుత్తా అమిత్‌కు కేసీఆర్ మొండిచేయి చూపించారు. అసంతృప్తితో కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న అమిత్‌.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అవకాశం ఇస్తారని ఆశించారు. అయితే.. తనకు అవకాశం ఇచ్చేలా లేరని గ్రహించిన అమిత్.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం సమర్థించటం గమనార్హం.


అయితే, ఇచ్చిన మాట మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా.. గుత్తా అమిత్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొర్పొరేషన్ పదవి ఇవ్వడం గమనార్హం. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa