హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఛైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారని కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. హైడ్రాపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రంగనాథ్.. కీలక ప్రకటన చేశారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పరిధిలో 1025 చెరువులున్నట్టు గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.
సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించినట్టు తెలిపారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ దగ్గరుందన్నారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ పరిధి మార్చినా కూడా.. వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశమవుతున్నామన్నారు. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని రంగనాథ్ తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేదన్నది గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కేవలం కూల్చివేతల కోసమే ఏర్పాటు చేసినట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే తమకు వెదర్ రాడార్ రాబోతుందని.. హైడ్రా కోసం ఒక ఎఫ్ఏం ఛానెల్ కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు.
మరోవైపు.. నోటరీ ఉన్న స్థలాలు, ఆస్తులు కొనేటప్పుడు ప్రజలు కాస్త ఆలోచించాలని.. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని ప్రజలకు రంగనాథ్ సూచించారు. అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్లు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇండ్లు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, ఎఫ్టీఎల్లో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రాకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19వ తేదీకి ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని స్పష్టం చేసిన రంగనాథ్.. అనుమతులు లేకుంటే మాత్రం కూల్చేస్తామని తెలిపారు.
హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 ఎకరాలను కాపాడినట్టు రంగనాథ్ తెలిపారు. 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ వెల్లడించారు. మరోవైపు.. ల్యాండ్ గ్రాబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలు, చదువుకున్న వాళ్లతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారని తెలిపారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa