కలియుగ దైవంగా హిందువులు భక్తిశ్రద్ధలతో కొలుచుకునే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు కూడా ఒక విమానం ఆలయ గోపురంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం పైనుంచి రాకపోకలు నిషిద్ధం. ఆలయంపై రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెపుతున్నారు. మరోవైపు, శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. తిరుమల ఆలయంపై విమాన రాకపోకలను నిషేధించాలని, ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. అయినా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోలేదు.