ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో త్వరలోనే ఏడు నక్షత్రాల హోటల్ కొలువు దీరనుంది. తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మించనుంది. తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం అడుగులు పడ్డాయి. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
తిరుపతిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 2021లో అప్పటి వైసీపీ సర్కారు హయాంలో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఆ నిర్ణయం ప్రకారం.. ఒబెరాయ్ గ్రూప్కు చెందిన మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్.. తిరుపతిలో లగ్జరీ రిసార్ట్ నిర్మించనుంది. ఇది పూర్తి అయితే రాయలసీమలోనే తొలి సెవన్ స్టార్ హోటల్గా నిలవనుంది. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ అనేక కారణాలతో ఆగిపోయింది. అయితే ఏపీ ప్రభుత్వం చొరవతో తిరిగి పనులు మొదలయ్యాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు కూడా తాజాగా మంజూరయ్యాయి. ఏడాదిన్నర కాలంలో నిర్మాణాలు పూర్తిచేసేలా పనులు ప్రారంభించారు.
ఒబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో 20 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాన్ని 66 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ 2022లో జీవో జారీ అయ్యింది. 2023 జులైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే రిసార్ట్ నిర్మాణ పనులు మాత్రం మొదలెట్టలేదు.
మరోవైపు తిరుమల కొండ కింద ఇలాంటి రిసార్ట్ వద్దంటూ హిందూ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. అలాగే పేరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఒబెరాయ్ సంస్థ ముంతాజ్ పేరుతో ఉన్న బోర్డు తొలగించి ట్రైడెంట్ గ్రూప్ అనే బోర్డు పెట్టింది. తాజాగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు కూడా రావటంతో.. ఒబెరాయ్ గ్రూప్ రిసార్ట్ నిర్మాణ పనులు మొదలెట్టింది. ఏడాదిన్నర కాలంలో నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుపుతున్నారు.
![]() |
![]() |