ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన స్నేహితుడిని కలిసిన ప్రధాని మోదీ.. చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్!

national |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 08:26 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మోదీ వెళ్లగా.. సోమవారం రోజు ఉదయం అక్కడకు చేరుకున్నారు. ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం అయ్యారు. అలాగే విందులో కూడా పాల్గొన్నారు. అక్కడే అమెరికా ఉఫాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సైతం కలుసుకున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందిస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో తన స్నేహితుడిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ స్నేహితుడు ఎవరు, ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ వెళ్లారు. ముందుగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలిశారు. ఈక్రమంలోనే ఆయన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ముందు అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీ మరియు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా అతిథులకు విందు ఇచ్చారు. ఈక్రమంలోనే ముగ్గురు నాయకులు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ కనిపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.


మరోవైపు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు, తన స్నేహితుడు అయిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఆయనను కౌగలించుకుంటున్న ఫొటోతో పాటు ఆత్మయంగా మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో పాటే మరో పోస్ట్ పెట్టిన మోదీ.. అక్కడి ప్రజలు మర్చిపోలేని స్వాగతాన్ని పలికారని చెప్పారు. చల్లటి వాతావరణంలో సాయం కాల సమయాన వారి అభిమానాన్ని చూస్తే మనసు ప్రేమతో నిండిపోయిందని వివరించారు. భారత ప్రవాసులకు కృతజ్ఞతలు చెబుతూనే.. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని వెల్లడించారు.


ఇదంతా ఇలా ఉండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇరు దేశాలు సహకరించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏఐ రంగంలో పరిశోధనలకు పెద్ద పీట వేయాలని కూడా ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ - ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.దీని తర్వాత ఇద్దరూ కలిసి మార్సెయిల్‌లో సరికొత్త కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను ప్రారంభిస్తారు.


అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన త్యాగాలకు నివాళి అర్పించడానికి మార్సెల్లెలోని కామన్ వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తున్న యుద్ధ స్మశాన వాటికను సందర్శించనున్నారు. అంతేకాకుండా ఆ పర్యటన అనంతరం అమెరికాకు వెళ్లి.. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవబోతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com