తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమర మాడవీధి నైరుతి మూలలో ఉ న్న వసంత మంటపానికి వేంచేస్తారు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకుని ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి వస్తారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది.
స్వామివారి బ్రహ్మోత్సవాలు ‘అంకురార్పణ’తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజు ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే ‘మత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు)అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే ‘అంకురార్పణ’ అని పిలుస్తారు.కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అభిషేకం అనంతరం స్వామివారికి వజ్రాభరణాలతో అలంకరణ చేపట్టారు. వచ్చేనెల 11న శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత దీన్ని తొలగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa