బంగారు ధర పైకి ఎగబాకే కొద్ది కొనుగోళ్లు సహజంగానే కాస్త తగ్గుతాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనివార్యంగా కొంటుంటారు. మరి బంగార ధర తగ్గితే ఇక కొనుగోలు స్పీడు పుంజుకొంటాయి. ఇపుడు అదే జరిగింది. ప్రజలు బంగారాన్ని భలే కొంటున్నారు. బంగారు కొనుగోళ్లపై కోవిడ్ ఒమిక్రాన్ భయాలు ఏవీ కనిపించలేదు. 2021లో బంగారం దిగుమతులు 55.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2020తో పోలిస్తే బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు దిగిరావడం ఇందుకు ప్రధాన కారణం. 2020లో బంగారం దిగుమతులు బిల్లు 22 బిలియన్ డాలర్లుగా ఉంది. 2011లో బంగారం దిగుమతుల విలువ 53.9 బిలియన్ డాలర్లకు ఎగసింది. పరిమాణం పరంగా చూస్తే.. భారత్ 2021లో 1050 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. పదేళ్లలో చూస్తే ఇదే గరిష్ట దిగుమతులు కావడం గమనార్హం. 2020లో బంగారం దిగుమతులు 430 టన్నులుగా ఉన్నాయి.కోవిడ్ 19 కారణంగా చాలా మంది 2020 నుంచి 2021కు పెళ్లిళ్లను పోస్ట్పోన్ చేసుకున్నారని గోల్డ్ హోల్సెల్లర్ హర్షద్ అజ్మీరా తెలిపారు. అంతేకాకుండా బంగారం ధర తగ్గడం వల్ల రిటైల్ విక్రయాలు పెరిగాయని పేర్కొన్నారు. 2020 ఆగస్ట్ నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ.56 వేల పైకి చేరిన విషయం తెలిసిందే. అయితే 2021 మార్చి నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ.43,300 స్థాయికి దిగివచ్చింది. దీంతో బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇకపోతే ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడం జనవరిలో బంగారం దిగుమతులపై ప్రభావం పడొచ్చు. ప్రభుత్వాలు స్థానికంగా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉండటం వల్ల అమ్మకాలపై ప్రభావం పడే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa