ఏపీ సీఎం వైఎస్ జగన్ – మెగాస్టార్ చిరంజీవి సమావేశంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరును ఏపీ సీఎం ఎందుకు పిలిచారో, ఒక్కడే వెళ్లి ఏపీ సీఎంతో ఆయన ఏం చర్చించారో తమకు తెలియదని అన్నారు. సినీ సమస్యలపై ప్రభుత్వం చర్చించాలనుకుంటే అందుకు సంబంధిత సంస్థలు ఉన్నాయని గుర్తించాలన్నారు. మెగాస్టార్ తమ నాయకుడేనని చెబుతూనే, ప్రభుత్వంతో చర్చలకు ప్రొడ్యూసర్ కౌన్సిల్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కూడా పిలవాలని సూచించారు. చిరంజీవిని ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమన్నారు. అయితే తమను కూడా పిలవాలని అడుక్కుని పిలిపించుకోవడం సరైంది కాదన్నారు. ఎవరు వెళ్లి మాట్లాడినా సినీ సమస్యలపైనే అని పేర్కొన్నారు. టాలీవుడ్లో ఐకమత్యం లేదని చెప్పారు. అయితే సమస్య వస్తే తామంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. ఇక నటీనటులంతా సినిమా చిత్రీకరణలో లగ్జరీ సౌకర్యాలు వదులుకుంటే బాగుంటుందని సూచించారు.