మలయాళ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరొందిన నటి కేపీఏసీ లలిత మంగళవారం కన్నుమూశారు. ఈ సీనియర్ నటి అనారోగ్యం బారిన పడి కొన్ని రోజుల క్రిందట కేరళలోని త్రిపుణితురలో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. 1947 జనవరి 25న జన్మించిన లలిత తొలుత రంగస్థల కళాకారిణిగా ఎంతో పేరొందారు. ఆమె అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ లో (కేపీఏసీ) చేరిన తర్వాత తన పేరును లలితగా మార్చుకున్నారు. మొత్తం ఆమె 550పైగా సినిమాల్లో నటించారు. రెండు సార్లు జాతీయ ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. గాయనిగా కూడా ఆమె ప్రతిభ చాటుకున్నారు. ఆమె మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. కేరళ సీఎం పినరయి విజయన్, నటి కీర్తి సురేష్, ప్రముఖ హీరోలు సంతాపం తెలిపారు.