by Suryaa Desk | Fri, Oct 18, 2024, 02:33 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులైన నిరుపేదలకు అందాలని జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే లతో కలసి అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పధకాల అమలులో నిర్లక్ష్యం
జరిగితే అధికారులపై డిసిప్లినరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రుణాలు పొందిన లబ్ధిదారులకు సకాలంలో సబ్సిడీ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విడతల వారీగా సబ్సిడీ మంజూరు చేయడం వల్ల లబ్ధిదారులకు ఆర్థికభారం ఆవుతుందని ఆయన తెలిపారు.
కోపరేటివ్ లేబర్ సొసైటీలు ఐదు ఉండగా ఒకటి ఎస్సి, ఒకటి ఎస్టికి ఉన్నదని, ఎలాంటి కొలెట్రాల్ సెక్యూరిటీ లేకుండా ఎస్సీలకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసేందుకు అన్ని బ్యాంకుల కంట్రోలర్లు చర్యలు తీసుకోవాలని ఎల్డిఎంను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కులో స్థల కేటాయింపులో ఎస్సీలకు రోస్టర్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జిఎంను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు ఉంటారని వారందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల సేవలను నిరంతర పర్యవేక్షణ చేయాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో ఇల్లు లేని నిరుపేద ఎస్సిలకు ఇండ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు లేని ఎస్సి కుటుంబాలను గుర్తించి మరుగుదొడ్లు మంజూరు చేయాలని, ఆరుబయట మల విసర్జన చేయడం సామాజిక నేరమని ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి వినియోగించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో తక్షణమే ఎస్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదులో ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొన్నారు.