|
|
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:59 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బెజ్జూర్ మండలం లోని నాగె పల్లి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు , యువతకు వాలీబాల్ కిట్లను మరియు వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులను సరఫరా చేశారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెజ్జూర్ మండలంలోని నాగెవల్లి, దొడ్డి గూడ, మోగవెల్లి గ్రామ ప్రజలు, పటేళ్లు సార్ మేడిలు సుమారు 300 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన విజేత హాస్పిటల్ కౌటాల వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసి ప్రజల సాంస్కృతి సంప్రదాయాలంటే తనకు ప్రత్యేక అభిమానమని , ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం ఒక అన్న లాగా కుటుంబ పెద్దలాగా పోలీస్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజా శ్రేయస్సును ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివాసి గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంత మైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు.
చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత అభిమానం ప్రేమ చూపిస్తున్న ఇక్కడి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వృద్దులకు దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్లను , నిత్యవసర సరుకులను పంపిణి చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేదలకు మందులను పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు స్వయంగా భోజనం వడ్డిoచి అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన విజేత హాస్పిటల్ కౌటాల డాక్టర్ బృందానికి ఎస్పీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎస్పి రామానుజం, కౌటాల సిఐ రమేష్, బెజ్జూర్ ఎస్సై ప్రవీణ్, విజేత హాస్పిటల్ కౌటల వైద్యుల బృందం, చుట్టుపక్క గ్రామాల పటేళ్లు , సార్ మెడీలు, ప్రజలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.