|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 02:38 PM
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్ఈఎల్, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను ప్రకటించింది.బీహెచ్ఈఎల్ డిపో (ఆర్సీపురం) నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్, కేపీహెచ్బీ, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళతాయి. ఇవి ప్రధానంగా విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.