ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి తుమ్మల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:42 PM

45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు.. ఎంతో ఆవేదన అనుభవించానంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నానంటూ ప్రెస్ మీట్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ఆరోపణలపై స్పందించిన నాగేశ్వర రావు.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. తాను పేరు కోసమో, ఫ్లెక్సీల్లో ఫొటోల కోసమే రాజకీయం చేయలేదని.. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానని వివరించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నాంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయంటూ మంత్రి ఎమోషనల్ అయ్యారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయ పడే వ్యక్తిని కాదంటూ చెప్పుకొచ్చారు.


భద్రాద్రి శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయతోనే తాను ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. దివంగత నేత ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ ఖమ్మం జిల్లాకు మేలు చేసేందుకే ప్రయత్నించానని మంత్రి చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే పారుతున్నా గోదావరి నీళ్లను వాడుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం వచ్చినప్పుడుల్లా... అప్పటి బడ్జెట్ తక్కువగా ఉండేదని.. ఇరిగేషన్‌కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేదని వివరించారు. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది తన సంకల్పమని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.


తాను ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించినట్టు తుమ్మల వివరించారు. నాడు బడ్జెట్‌లో దేవదులను పూర్తి చేశామని.. దాన్ని ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్‌‌గా విడదీశారని చెప్పుకొచ్చారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్‌ టెండర్లు పిలిచారని.. దురదృష్టవశాత్తు వైఎస్సార్‌ మృతి ఆ ప్రాజెక్టుకి శాపంగా మారిందని తుమ్మల వివరించారు.


తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. ప్రాజెక్టు కోసం, ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు చెప్పుకొచ్చారు. ఫలితంగా మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం దొరికిందని తెలిపారు. ఆనాడు.. ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేయటంతో.. పనులు ప్రారంభమయ్యాయని.. మళ్లీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయని తుమ్మల వివరించారు.


రోళ్లపాడు అలైన్‌మెంట్ జూలూరుపాడుకి‌ మార్చారని పేర్కొన్నారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదన్నారు. అందుకే.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యానని వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 8 వేల కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa