ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో ట్రాఫిక్ ఎస్‌పై మహిళల దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:44 PM

తాగి వాహనాలు నడపటం నేరం. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులు, యాక్సిడెంట్లు తాగిన మైకంలో జరిగినవే. మద్యం సేవించి వాహనాలు నడపితే కఠిన చర్యలు తీసుకుంటామని..జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించే సమయంలో వారిపైనే దాడులకు దిగుతున్నారు. మైకంలో నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా..కొందరు మహిళలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ, హోంగార్డుపై దాడి చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్ 2లోని పార్క్‌ హయత్‌ హోటల్ ముందు రెండ్రోజుల క్రితం ట్రాఫిక్‌ ఎస్‌ఐ అవినాశ్‌ బాబు, హోంగార్డు నరేష్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.15 గంటల ప్రాంతంలో అటుగా ఓ కారు వచ్చింది. కారు నడుపుతున్న మహిళకు హోంగార్డు నరేష్‌ బ్రీత్ ఎనలైజర్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిచేందుకు ప్రయత్నించాడు. అయితే తాగిన మైకంలో ఉన్న సదరు మహిళ.. టెస్టును నిరాకరించి పోలీసులను నానా బూతులు తిట్టింది.


కారులో ఆమెతోపాటు మరో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారు కూడా ఆమెను వద్దని వారించలేదు. కారు నడుపుతున్న మహిళే హోంగార్డు నరేష్ సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కొని నేలకేసి కొట్టింది. ఇదేంటని ప్రశ్నించేందుకు వచ్చిన ఎస్‌ఐ అవినాశ్‌ బాబుపై కూడా దౌర్జన్యం చేసింది. అతడు ధరించిన బాడీ కెమెరాను ధ్వంసం చేసింది. మహిళలతో మాట్లాడుతుండగా.. మరో కారులో అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు హోంగార్డు నరేష్‌ను బండ బూతులు తిట్టారు. అనంతరం మహిళలు అక్కడి నుంచి మెళ్లిగా ఎస్కేప్ కాగా.. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.


పట్టుబడిన ఇద్దరు యువకులు బేగంపేట ప్రాంతానికి చెందిన అన్నదమమ్ములు పోలీసులు గుర్తించారు. వారి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. మద్యం తాగినట్లు తేలింది. హోంగార్డు నరేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు యువకులతో పాటు ముగ్గురు మహిళలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa