ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రాపై ఉద్యమం చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 07:28 PM

హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన హైడ్రా కూల్చివేతలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఆగస్టు 20న) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాటిపల్లి.. హైడ్రా కూల్చివేతలపై అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా ఆలోచన బాగుంది కానీ ఆచరణలో సాధ్యమవడంలేదని వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు. హైడ్రా వల్ల అక్రమణలు చేసినవారి కంటే.. సామాన్య ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎప్పుడో ఎవరో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బలి అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కూల్చివేతలతో ప్రజలే తప్పు చేశారని నేతలు, అధికారులు రుజువు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారి సంగతి ఏంటని కాటిపల్లి ప్రశ్నించారు.


ప్రజలకు శిఖం భూమా, చెరువు భూమా, బఫర్ జోన్ భూమా అనే విషయాలు తెలియకుండానే భూములు కొన్నారని కాటిపల్లి వివరించారు. అసలు చెరువు భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుమతులు ఎవరిచ్చారని.. లే అవుట్‌ వేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరంటూ నిలదీశారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి, ఏవీ రంగనాథ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.


ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల తలరాతలు మాత్రం మారడంలేదని కాటిపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కొత్తగా సాధించేదేమి లేదని.. సామన్య ప్రజల బతుకులను కూల్చడం తప్ప చేసిందేంటని ప్రశ్నించారు. కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కాటిపల్లి డిమాండ్ చేశారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయన్న విషయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రజల బలహీనతతో బ్యూరోక్రాట్స్‌, రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. హైడ్రాపై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని.. ఇందులోభాగంగా సచివాలయం ముందు వంటవార్పు కార్యక్రమం చేపట్టనున్నట్టు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.


అయితే.. హైదరాబాద్ మహా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు అంటూ తేడా లేకుండా.. హైడ్రా బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటలు, నాలాల పరిధిలో చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. కాగా.. హైడ్రా కూల్చివేతలపై పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa