ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ జైళ్లు ‘హౌస్ ఫుల్’.. ఆ కేసుల్లో అరెస్టైన ఖైదీలే ఎక్కువ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 09:05 PM

తెలంగాణలో జైళ్లు విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో ఖైదీలు పెరిగిపోవటంతో వారి సంక్షేమం, జైలు వనరులు, సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. హైదరాబాద్ చంచల్ గూడ జైలు సహా.. సంగారెడ్డి జైలు వంటి కీలక జైళ్లు వాటి సార్థ్యం కంటే రెట్టింపు సామర్థ్యంతో పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రధాన జైళ్లు కూడా వాటి పరిమితుల కంటే 50-60 శాతం ఎక్కువగా ఖైదీలతో నిండిపోయాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య పెరగటమే ఇందుకు కారణంగా జైళ్లశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీలు, ప్రోటోకాల్‌లలో మార్పుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంది. ఫలితంగా 1,250 మంది ఖైదీలను ఉంచడానికి వసతులున్న చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రస్తుతం 2,103 మంది ఖైదీలు ఉన్నారు. సంగారెడ్డి జైలులో 220 మంది ఖైదీలకు గాను 569 మంది ఉన్నారు.


ఇటీవల హైదరాబాద్‌, సైబరాబాద్‌లకు చెందిన రిమాండ్‌ ఖైదీలను ముఖ్యంగా డ్రగ్స్‌ నేరాలకు పాల్పడుతున్న వారిని చంచల్‌గూడ జైలుకు తరలించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. గతంలో ఎల్‌బీ నగర్‌, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ కోర్టుల్లో రిమాండ్‌కు గురైన ఖైదీలను నగర శివార్లలోని చర్లపల్లి జైలుకు తరలించేవారు. పెరిగిన రవాణా ఖర్చులు, భద్రతా, ఎస్కార్ట్‌లను అందించడంలో సవాళ్ల కారణంగా ఈ ఖైదీలలో చాలా మందిని కోర్టు అనుమతితో చంచల్‌గూడకు తరలిస్తున్నారు. దీంతో ఖైదీలను ఉంచటానికి గతంలో మూసివేసిన VIP బ్యారక్‌ను అధికారులు తిరిగి తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుకు 500 వరకు ఖైదీల బంధవులు ములాఖత్‌కు వస్తుండటంతో జైలు అధికారులు సందర్శన గంటలను రెండు గంటలు పొడిగించాల్సి వచ్చింది.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలోని 4 సెంట్రల్ జైళ్లు, 7 జిల్లా జైళ్లు, 29 సబ్ జైళ్లు, 2 మహిళా జైళ్లు, 3 ఇతర జైళ్లలో కలిపి మెుత్తం 7,392 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 4,791 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 2,023 మంది శిక్ష పడిన ఖైదీలు, 838 మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కారాగారాన్ని మూసివేయడంతో సమస్య మరింత జఠిలమైంది. వరంగల్‌కు చెందిన సుమారు 1,000 మంది ఖైదీలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,నిజామాబాద్‌లోని ఇతర జైళ్లకు పంపారు. దీంతో ఆయా జైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే సిద్దిపేటలో కొత్త జైలు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. రూ. 90 కోట్ల వ్యయంతో ఈ కొత్త జైలును నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జైళ్లలో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa