ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లగచర్ల ఘటన.. రంగంలోకి ఎన్ హెచ్ఆర్ సీ బృందం.. జైల్లో రైతులను కలిసిన సభ్యులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 06:53 PM

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు రైతుల్ని అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం వారు సంగారెడ్డి జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వీరిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) బృందం ఇవాళ కలిసింది. 8 మంది సభ్యులతో కూడిన బృందం జైలుకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ కేసులో A2 నిందితుడు సురేష్ సహా 19 మంది నిందితులు సంగారెడ్డి జిల్లా జైలులో ఉండగా.. వారిని కలిశారు. శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న 8 మంది సభ్యులతో కూడిన NHRC బృందం.. ఈ రోజు ఉదయం నేరుగా సంగారెడ్డి జైలుకు వెళ్లింది. అక్కడ ఖైదీలుగా ఉన్న రైతులను కలిసి... లగచర్ల ఘటనలో ఏం జరిగిందో వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


కాగా, లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 11న భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ కలెక్టర్ సహా.. ఇతర అధికారులు గ్రామానికి చేరుకోగా వారిపై రైతులు దాడికి పాల్పడ్డారు. కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. కలెక్టర్ సహా.. ఇతర అధికారుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా.. వీడియోలో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మరుసటి రోజు రాత్రి తండాల్లోకి వెళ్లిన పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. మెుత్తం19 మంది రైతులను కోర్టులో హాజరు పరచగా.. వారికి రిమాండ్ విధించారు.


ప్రస్తుతం సంగారెడ్డి జైలులో రైతులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే రైతుల అరెస్టుల సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పలువురు ఎన్ హెచ్ఆర్ సీకి ఆశ్రయించారు. కుట్రపూరితంగా అమాయకులను అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. గిరిజనులు, ఆడవారి పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని.. అర్థరాత్రి ఇండ్లలోకి చొరబడి తమ వారిని అరెస్టు చేశారని పలువురు బాధితులు ఎన్ హెచ్ఆర్ సీని ఆశ్రయించారు. దీంతో 8 మంది సభ్యులతో జాతీయ మానవ హక్కుల సంఘం ఓ బృందాన్ని ఏర్పాుటు చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి.. బాధితులకు న్యాయం చేసేందుకు ఎన్ హెచ్ఆర్ సీ రంగంలోకి దిగింది.


కాగా, కుట్రపూరితంగా లగచర్లలో అధికారులపై దాడులకు పాల్పడ్డారని సీఎం రేవంత్ విమర్శించారు. ఈ ఘటనలో ప్రతిపక్షాల కుట్ర ఉందని అన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీలు పట్టడం లేదని.. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa