ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు, వాళ్లకైతే రూ.6 వేలు.. ముహూర్తం ఫిక్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 06:47 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పలు కీలక హామీలను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతు రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు లాంటి కీలక పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్‌ పథకాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


అయితే.. గత ప్రభుత్వంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందిచగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలకు, రూ.4 వేలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ.. ఇంకా పింఛన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై అసంతృప్తి వెల్లగక్కుతున్నట్టు సర్కార్ దృష్టికి వచ్చింది.


మరోవైపు.. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండటంతో.. ప్రజల్లోని అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉండటంతో.. ఆసరా పింఛన్ పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికలలోపే ఈ పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ పథకం అమలుపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.


కాగా.. డిసెంబర్ 09 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా.. అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది. ఉపసంఘం ఇచ్చే నివేధికపై అసెంబ్లీలో చర్చించి, అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకుని.. రైతు భరోసాపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆసరా పెన్షన్ పథకం అమలుపై కూడా ప్రకటన చేయనున్నట్టు సమాచారం. దీంతో.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఏడాది నుంచి పెంచిన డబ్బులతో పెన్షన్ లబ్దిదారుల అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa