2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల చెంతన మన దేశాన్ని నిలపడానికి వికసిత్ భారత్ విజన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని అన్నారు. రాజకీయ అవసరాల కంటే దేశ ప్రజలే ముఖ్యమనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందని తెలిపారు.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా 2025-26 బడ్జెట్పై పవన్ కల్యాణ్ స్పందించారు.రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని చెప్పుకొచ్చారు. రూ.10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడంతో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుందని చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని వివరించారు. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోందన్నారు. ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతిని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగిందని చెప్పారు.